


విజయభారతి : ఆర్మూర్ న్యూస్ | జూలై 19
ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిట్ గ్రామంలో గ్రామదేవతలకు ఆదివారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గంగాజలాలతో ప్రత్యేక జలాభిషేక కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు.వివిధ కులాలకు చెందిన గ్రామస్థులు, మహిళలు మంగళహారతులు పట్టుకుని భక్తి భావంతో కాలినడకన గ్రామదేవతల ఆలయాలకు చేరుకుని గంగాజలాలతో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం దేవతలకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి గ్రామ శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గ్రామ ప్రజల సంక్షేమం, వ్యవసాయం అభివృద్ధి, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రతి ఏడాది ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
