
విజయభారతి :ఆర్మూర్, న్యూస్ జూలై 21
ఆర్మూర్ నియోజకవర్గ రాజకీయాలు రోజురోజుకు మరింతవేడెక్కుతున్నాయి.బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఛలో అంకాపూర్”కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంకాపూర్ గ్రామంలో పోలీసులు సెక్షన్ 144 అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామంలోకి ఐదుగురికి మించి గుమికూడకుండా ఆంక్షలు విధించారు.ఇదిలా ఉండగా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పలుచోట్ల ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు, నిరసన కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ చర్యలను కాంగ్రెస్ నాయకులు ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించారు.మరోవైపు, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం అంకాపూర్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ, పోలీసుల కట్టుదిట్టమైన భద్రత నడుమ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.
