


విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై 19
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు బాధ్యతారాహిత్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ మండిపడ్డారు. ఎమ్మెల్యే ఇంటి వద్దకు కాంగ్రెస్ నాయకులు వస్తే, వారికి ఎదురుగా వేలాది మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిలబడతారని హెచ్చరించారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం, 92 గ్రామాలకు 3 వేల ఇళ్ల మంజూరు, రూ.45 కోట్లతో ఆర్మూర్ మున్సిపాలిటీకి ఆధునిక సౌకర్యాలు, అమృత్ పథకం కింద రూ.43 కోట్ల నిధులు, డొంకేశ్వర్ మండలానికి ఎమ్మార్వో కార్యాలయ భవనం మంజూరు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కృషి ఫలితమేనని ఆయన పేర్కొన్నారు.గల్ఫ్ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందేలా కృషి చేశారని గుర్తు చేశారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా సుమారు రూ.700 కోట్ల అభివృద్ధి పనులను నియోజకవర్గానికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా ఎన్నికల హామీల అమలులో విఫలమైందని దినేష్ ఆరోపించారు. ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అనంతరం రాజకీయ విమర్శలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గద్దె భూమన్న, ప్రధాన కార్యదర్శులు పోతంగల్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు యాదాల నరేష్, జ్యోతి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఓం సింగ్, రూరల్ మండల అధ్యక్షుడు ఆనంద్, సంతోష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
