
విజయభారతి : ఆర్మూర్ న్యూస్, జూలై 5
ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిట్ కోటార్మూర్లో బోర్ మోటార్ మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ బోర్ మెకానిక్ మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, పెర్కిట్కు చెందిన పన్నీరు శ్రీనివాస్ (46), తండ్రి చిన్నయ్య, బోర్ మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో అల్లూరి నాగరాజు పొలంలో బోర్ మోటార్ మరమ్మతు పనుల నిమిత్తం వెళ్లాడు.అక్కడ స్టార్టర్ డబ్బాకు ఉన్న సర్వీస్ వైరు నుంచి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనే ఉన్న నాగభూషణం వెంటనే కర్ర సహాయంతో అతడిని విద్యుత్ తీగ నుంచి విడదీసి కాపాడే ప్రయత్నం చేశాడు. అనంతరం కుటుంబ సభ్యులు, స్థానికులు శ్రీనివాస్ను చికిత్స నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యుడు పరీక్షించి, శ్రీనివాస్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు సమాచారం. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచినట్లు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
