
విజయభారతి : హైదరాబాద్ న్యూస్ జులై 11
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు నమోదు ప్రక్రియ (ఎస్ఐఆర్)ను విజయవంతం చేసేందుకు ప్రతి అర్హ ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం నింపి సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.
ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా రెండు చోట్ల ఓటు నమోదు చేసుకుంటే చట్టపరంగా అది నేరమని, అలాంటి వారికి ఏడాది వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును రక్షించుకోవాలని సూచించారు.ఎన్యూమరేషన్ ఫారం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నింపి ఇవ్వాల్సిందేనని, ఈ విషయంలో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సహా ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎన్యూమరేషన్ ఫారం అందకపోతే సంబంధిత అధికారులు లేదా బీఎల్వోను సంప్రదించి ఫారం-6 ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా సాగుతుండగా, పట్టణ ప్రాంతాల్లో చిరునామా సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని చోట్ల బీఎల్వోలకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఫారాల పంపిణీలో ఆలస్యం జరిగినట్లు తెలిపారు. ఈ సమస్యలను త్వరగా పరిష్కరించి ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
