అమరవీరుల త్యాగాలకు అవమానం
దుండిగల్ మున్సిపాలిటీ వద్ద అధికారుల నిర్లక్ష్యం పై భగ్గుమన్న ఎమ్మెల్సీ శాంబీపూర్ రాజు
విజయభారతి/ కుత్బుల్లాపూర్ :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేళ దుండిగల్ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో తీవ్ర కలకలం రేగింది. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో, అమరవీరుల స్తూపానికి కనీస అలంకరణ కూడా చేయకపోవడం పై స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్సీ శాంబీపూర్ రాజు, ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ స్తూపం వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా శాంబీపూర్ రాజు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని గత ప్రభుత్వంలో కేసిఆర్ నాయకత్వంలో వారం రోజుల పాటు పండుగలా జరుపుకునేవాళ్లం. బతుకమ్మ సంబరాలు, విద్యుత్ దీపాలు, రంగురంగుల పూల అలంకరణలతో అమరవీరుల స్తూపాలు కళకళలాడేవి. కానీ నేడు డిప్యూటీ కమిషనర్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాలు ఉన్న ఈ ముఖ్యమైన ప్రాంతంలో అమరవీరుల స్తూపాన్ని అధికారులు పూర్తిగా విస్మరించడం అత్యంత బాధాకరం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్ దృష్టికి నిర్లక్ష్యపర్వం:
సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకోగా, మున్సిపల్ కార్యాలయంలో ఏ ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. దీని పై ఎమ్మెల్సీ శాంబీపూర్ రాజు తక్షణమే స్పందిస్తూ ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. బాధ్యుల పై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమం పట్ల, అమరవీరుల త్యాగాల పట్ల చిత్తశుద్ధి, కనీస అవగాహన లేని వ్యక్తులు అధికారంలో ఉండటం వల్లే ఇలాంటి దుస్థితి దాపురించిందని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సహించేది లేదని, అమరవీరులకు తగిన గౌరవం ఇవ్వకపోతే ఉద్యమాలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు మరియు అమరవీరుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
