
విజయభారతి : వేల్పూర్ న్యూస్ జూలై 7
వేల్పూర్, జూలై 7: వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సోమవారం సోషల్ ఆడిట్ నిర్వహించారు. పాఠశాల జీహెచ్ఎం మల్లీశ్వరి ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష తెలంగాణ ద్వారా హైదరాబాద్కు చెందిన సీఈఎస్ఎస్ ఫ్యాకల్టీ గుండె అఖిల్ పాఠశాలను సందర్శించి సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించిన ఆయన, పాఠశాలకు సంబంధించిన వివిధ రికార్డులను తనిఖీ చేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో పాఠశాల నిర్వహణ, బోధన, సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.
విద్యార్థులకు అందిస్తున్న సహపాఠ్య కార్యక్రమాలు, క్రీడా కార్యకలాపాలు, అభ్యసన ఫలితాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిజికల్ సైన్స్ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, సోషల్ ల్యాబ్లను పరిశీలించి విద్యార్థులు ప్రయోగాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్న తీరును పరిశీలించారు. పాఠశాల గ్రంథాలయంలోని పుస్తకాలను విద్యార్థులు ఎలా వినియోగించుకుంటున్నారనే అంశంపైనా ఆరా తీశారు.
అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం అమలు, మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహార పదార్థాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ పాఠశాల అభివృద్ధికి జీహెచ్ఎం మల్లీశ్వరి కృషి చేస్తున్నారని గుండె అఖిల్ ప్రశంసించారు.
అంక్సాపూర్ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్య, క్రీడలు, ప్రయోగశాలల వినియోగం, గ్రంథాలయ నిర్వహణతో పాటు ఇతర అన్ని రంగాల్లో ముందంజలో ఉందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవిచందర్, రఘునాథ్, శ్రీదేవి, రాజేంద్ర, సదాశివ్, దేవరాజ్, వినోద్, శ్రీలక్ష్మి, దేవ, సుకన్య, జాన్సన్, వేణుగోపాల్ రెడ్డి, రాజు, సీఆర్పీ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
