.

విజయభారతి : నిజామాబాద్ న్యూస్
ఆర్మూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు బిల్లులు అందక నిలిచిపోతున్నాయని బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం పిల్లర్లు వేసి తదుపరి పనులు చేపట్టేందుకు లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు నిర్మించుకుంటున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులతో పాటు నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు కూడా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం పేదల గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి, ఆర్మూర్ నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జీవన్రెడ్డి కోరారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి, ఆగిపోయిన నిర్మాణ పనులకు మోక్షం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
