
విజయభారతి :ఎర్గట్ల న్యూస్ జులై 9
ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ పావని గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆమె మృతి వార్త తెలిసిన వెంటనే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చిన్న వయసులోనే ప్రజల ఆశీర్వాదాలతో తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన పావని, గ్రామాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని నిరంతరం కృషి చేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం, ప్రజలకు అవసరమైన ప్రభుత్వ పథకాల అందుబాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలకు చేరువయ్యారు.
అందరినీ ఆప్యాయంగా పలకరించడం, గ్రామ ప్రజలతో కలిసిమెలిసి ఉండటం ఆమె ప్రత్యేకతగా నిలిచింది. ఎవరికైనా సమస్య వస్తే వెంటనే స్పందించి పరిష్కారానికి ప్రయత్నించే స్వభావంతో పావని గ్రామ ప్రజల మన్ననలు పొందారు. సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి గ్రామ ప్రగతి కోసం ఆమె చేసిన సేవలను పలువురు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
పావని మృతి తాళ్ల రాంపూర్ గ్రామానికి తీరని లోటని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పావని ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రార్థించారు.
