


విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జులై 9
ఆర్మూర్ మండలంలో ప్రైవేట్ పాఠశాలల నిర్వహణపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారాం పలు ప్రైవేట్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అంకాపూర్లోని శాంతి నికేతన్, భార్గవి హైస్కూల్తో పాటు బ్లూబర్డ్స్ స్కూల్, ఆలనూర్ స్కూల్, సుఫ్ఫా స్కూల్, అలహుదా స్కూల్, ప్రజ్ఞ స్కూల్లను పరిశీలించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల అర్హతలు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, తాగునీరు, మరుగుదొడ్లు, ఆటస్థలాలు, పాఠ్యపుస్తకాలు తదితర అంశాలను పరిశీలించారు.
అనర్హత కలిగిన ఉపాధ్యాయులను వెంటనే తొలగించి, అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించుకోవాలని పాఠశాల యాజమాన్యాలకు సూచించారు. నియమిత ఉపాధ్యాయుల వివరాలను విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు. పాఠ్యపుస్తకాలు, ఇతర విద్యా సామగ్రిని పాఠశాలలే విక్రయించరాదని స్పష్టం చేశారు.
విద్యార్థులందరికీ స్వచ్ఛమైన మంచినీటి సదుపాయం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిల్లలు ఆడుకోవడానికి తగిన స్థలం, ఆటవస్తువులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా, మండల యంత్రాంగాలు ప్రైవేట్ విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహిస్తున్నాయని ఎంఈఓ రాజా గంగారాం తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నిర్వహిస్తే సంబంధిత యాజమాన్యాలపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
