

విజయభారతి : భీంగల్ న్యూస్ జూలై 9
భీంగల్ మండల కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధి నందిగల్లీలో అబ్కారీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 116 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అబ్కారీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగల్లీలోని ఒక ఇంట్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, మాడెడ్ మండలం సోమనపల్లె గ్రామానికి చెందిన మేడే లక్ష్మయ్య (తండ్రి: మేడే చిన్నా)ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు నిర్మాణ కార్మికుడిగా భీంగల్లో నివసిస్తూ, ఛత్తీస్గఢ్ నుంచి ఎండు గంజాయిని తరలించి తీసుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం దానిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో ప్యాకెట్ను రూ.500కు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. నిందితుడితో కలిసి నివసిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులను భీంగల్ తహసీల్దార్ కార్యాలయంలో హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.
