

ఆలూర్ మండలంలోని ఆలూర్, దేగాం, రామచంద్రపల్లి, గుత్ప గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రత్యేక డ్రైవ్ను జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ, తహసీల్దార్ రమేష్, సబ్ యూనిట్ ఆఫీసర్ సాయన్న ఆదివారం పరిశీలించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను తనిఖీ చేసి, బీఎల్వోలు చేపడుతున్న దరఖాస్తుల స్వీకరణ, ఓటరు వివరాల నమోదు, సవరణ ప్రక్రియపై ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి అర్హుడి ఓటు ఎంతో విలువైనదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రత్యేక డ్రైవ్ను సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం, అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపులు సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. అధికారులు, బీఎల్వోలు ప్రజలకు పారదర్శకంగా సేవలందిస్తూ ఎలాంటి ఫిర్యాదులకు తావు లేకుండా విధులు నిర్వర్తించాలని ఆమె ఆదేశించారు.తరువాత తహసీల్దార్ రమేష్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్కు సంబంధించిన దరఖాస్తు ఫారాలను సంబంధిత బీఎల్వోలకు తప్పనిసరిగా అందజేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయడంలో బీఎల్వోలు, బీఎల్ఏ ఏజెంట్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితాకు దూరం కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జీపీఓ అజయ్, సప్తగిరి, గ్రామ పంచాయతీ కారోబార్ సంతోష్, బీఎల్వోలు, బీఎల్ఏ ఏజెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
