

విజయభారతి : ఆలూరు న్యూస్ : రిపోర్టర్ సుంకరి గంగ మోహన్
ఆలూర్ మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ రాజశ్రీ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, నిర్వహిస్తున్న రికార్డులు, వివిధ రిజిస్టర్లు, మందుల నిల్వలు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల లభ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా బుధవారం నిర్వహించే సాధారణ ఇమ్యునైజేషన్ కార్యక్రమంపై వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలోని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వ్యాధి నిరోధక టీకాలు ఎలాంటి అంతరాయం లేకుండా అందించాలని సూచించారు. ఒక్క అర్హుడూ టీకాలకు దూరం కాకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ఆసుపత్రుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.వైద్య సిబ్బంది సమయపాలనను కచ్చితంగా పాటించాలని, సబ్సెంటర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని డీఎంహెచ్వో ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సత్వర వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యానికి తావు ఉండరాదని స్పష్టం చేశారు.తనిఖీ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
