

ఆర్మూర్, జూలై 13 (విజయభారతి):
ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసి వేయించారు.ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయని తెలిపారు. అలాగే విద్యార్థులు ప్రతిరోజూ భోజనానికి ముందు చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని సూచించారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈగలు వంటి కీటకాల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని అవగాహన కల్పించారు.పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మద్దికుంట శ్రీనివాస్ మాట్లాడుతూ, నులిపురుగుల నివారణ మాత్రల వల్ల రక్తహీనతతో పాటు పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ ప్రసన్న, హెల్త్ అసిస్టెంట్ అరుణ, సైన్స్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులకు ఆరోగ్య సూచనలు అందించారు.
