
విజయభారతి, ఆలూరు న్యూస్:
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వేయి నామాల వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షల ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హామీ ఇచ్చారు.శుక్రవారం ఆలూరు మండల కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి శ్రీ వేయి నామాల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, అక్కడ కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలతో సమావేశమై ఆలయ అభివృద్ధికి అవసరమైన అంశాలపై చర్చించారు.
ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు క్షేత్ర అభివృద్ధి పనులు చేపట్టేందుకు తన ఎమ్మెల్యే కోటా నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధులను ఆలయ విస్తరణ, మౌలిక వసతుల కల్పన, భక్తుల సౌకర్యాల మెరుగుదలకు వినియోగించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు.
