
విజయభారతి :ఆర్మూర్, న్యూస్ జూలై 4:
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీజేపీ నాయకులు హెచ్చరించారు. శనివారం ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్కం వేణు మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గురించి కొందరు నాయకులు తమ స్థాయిని మించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అంటూ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం సరికాదని, అవసరమైతే సంబంధిత లైసెన్సులను పరిశీలించుకోవచ్చని అన్నారు. బాల్కొండ నాయకుడు ఇరవత్రి అనిల్ ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బీజేపీ నాయకుల జోలికి వస్తే ఆర్మూర్ మీదుగా వెళ్లకుండా అడ్డుకుంటామని, ఇకనైనా బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు.సీఎం సహాయనిధి సహా ప్రభుత్వ పథకాలు, ఇతర నిధులను ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి తీసుకువస్తున్నారని పుల్కం వేణు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన హయాంలో బీసీ, ఎస్సీ విద్యార్థుల హాస్టళ్ల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే దారి మళ్లించేందుకు రాజకీయ విమర్శలు చేస్తున్నారని అన్నారు.ఓబీసీ నాయకుడు యామాద్రి భాస్కర్ మాట్లాడుతూ, కనీసం కౌన్సిలర్గా పోటీ చేసి గెలవని వారు కూడా ఎమ్మెల్యేపై మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. రెండు లక్షల ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో 30 వేల మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే గురించి విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ఏబీ చిన్న ఏ వ్యాపారం చేస్తున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాపారాలపై ప్రభుత్వంతో విచారణ చేయించాలని కూడా కోరారు.కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మారా చంద్రమోహన్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం తగదని యామాద్రి భాస్కర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు కేవలం నామినేటెడ్ పదవులకే పరిమితమవుతున్నారని విమర్శించారు.
బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టిలో పడేందుకు ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎంత ప్రయత్నించినా ఆర్మూర్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని, పోటీలో నిలిచే అవకాశమూ లేదని వ్యాఖ్యానించారు. కమిషన్లు, బెదిరింపులు మానుకుని ప్రజల పక్షాన పనిచేయాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నూతల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు బొట్టు రాజు, శ్రావణ్, అరుణ్, ఈశ్వర్, శ్రీనివాస్, బీజేపీ యువమోర్చా పట్టణ అధ్యక్షుడు ఉదయ్ గౌడ్, పులి యుగేందర్, మామిడిపల్లి అరుణ్, జెస్సు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
