
విజయభారతి, భీమ్గల్:
ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ పథకం కింద నిర్వహిస్తున్న విజ్ఞాన్ స్కూల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు టీజీవీపీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (జెడ్పీసీఈఓ)కు వినతిపత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా టీజీవీపీ టౌన్ ప్రెసిడెంట్ సుంకోజి అఖిల్ మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదనే కారణంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన షూస్, పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రికి కూడా డబ్బులు తీసుకుంటున్నారని తెలిపారు.విద్యార్థులు ఉపయోగించాల్సిన నోట్బుక్స్ను పాఠశాల యాజమాన్యమే అధిక ధరలకు విక్రయిస్తూ, వాటికి ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా, ఆ నోట్బుక్స్ను తప్పనిసరిగా పాఠశాల నుంచే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి, అక్రమాలు జరిగినట్లు తేలితే పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన, శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి విద్యార్థికి పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని టీజీవీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో హేమంత్, అంకుష్, రోహన్ తదితరులు పాల్గొన్నారు.
