74 కిలోల రాగి తీగలు, ఆటో ట్రాలీ, 3 బైక్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం…
ఏడుగురు నిందితులు అరెస్ట్ – 19 చోరీ కేసులు ఛేదించిన పోలీసులు…

విజయభారతి : ఆర్మూర్ న్యూస్
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి కాయిల్స్ను లక్ష్యంగా చేసుకుని పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 74 కిలోల రాగి తీగలు, ఒక బజాజ్ మాక్సిమా ట్రాలీ ఆటో, మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, చోరీలకు ఉపయోగించిన పనిముట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, ఆర్మూర్కు చెందిన కర్రే వినోద్ కుమార్, అండ్రాసి నవీన్, గుంబోల్ల ఈశ్వర్, బాజ హరిప్రసాద్, కర్తే విజయ్ కుమార్, మూల దుర్గాప్రసాద్ రెడ్డి తదితరులు ఒక ముఠాగా ఏర్పడి, పగటి సమయంలో పాత సామాన్ కొనుగోలు చేస్తున్నట్లు గ్రామాల్లో తిరుగుతూ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించేవారు. అనంతరం రాత్రి వేళల్లో ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వైరును దొంగిలించి, ఆర్మూర్కు చెందిన పాత సామాన్ వ్యాపారి అబ్దుల్ వసీం (అలియాస్ తిల్లి బాబాకు) విక్రయించి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులు వేల్పూర్, బాల్కొండ, మెండోర, భీంగల్, ఆర్మూర్, ఎర్గట్ల పోలీస్ స్టేషన్ పరిధుల్లో మొత్తం 19 ట్రాన్స్ఫార్మర్ చోరీ కేసులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ సొత్తు కొనుగోలు చేసిన కేసుల్లో పాత సామాన్ వ్యాపారి అబ్దుల్ వసీంపై గతంలో కూడా కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం పడగల్ గ్రామ శివారులోని పాత బీటీ రోడ్డుపై రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అనంతరం ఆర్మూర్లో పాత సామాన్ వ్యాపారి అబ్దుల్ వసీంను కూడా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మాట్లాడుతూ, విద్యుత్ మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. చోరీ సొత్తును కొనుగోలు చేసే వారిపైనా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామ శివార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని సీపీ అభినందించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ శుభం నగరాలే, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, రూరల్ సీఐ జాన్ రెడ్డి, వేల్పూర్ ఎస్సై సంజీవ్, బాల్కొండ ఎస్సై శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.
