



. విజయభారతి : ఆర్మూర్ న్యూస్
ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో “మన కాలనీ–మన భద్రత–మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ అవేర్నెస్, ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాలు, షీ టీమ్ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తుందని, యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, రహదారులపై ప్రయాణించే సమయంలో హెల్మెట్, సీట్బెల్ట్ వంటి భద్రతా నియమాలను విస్మరించవద్దని అన్నారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని లింకులు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా సందేశాలకు స్పందించి వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు.
మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్ సేవలను వినియోగించుకోవాలని, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వెంటనే 108 లేదా 100కు కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. తమ చుట్టుపక్కల ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగినా ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
విద్యార్థులు నేటి సమాజంలో జరుగుతున్న పరిణామాలపై పూర్తి అవగాహన కలిగి, బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, ఉపాధ్యాయ బృందం, పోలీసు సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
…
