
విజయభారతి – ఆర్మూర్ న్యూస్ | జూలై 14
ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో మైనర్లు వాహనాలు నడపకుండా అరికట్టేందుకు రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టిందని మోటారు వాహనాల ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) ఈ. రాహుల్ కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు ద్విచక్ర లేదా నాలుగు చక్రాల వాహనాలు నడిపేందుకు అనుమతించవద్దని విజ్ఞప్తి చేశారు. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే మోటారు వాహనాల చట్టం–1988లోని సెక్షన్ 199A ప్రకారం వాహన యజమాని లేదా సంరక్షకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ నిబంధనల ప్రకారం రూ.25 వేల వరకు జరిమానా, జైలు శిక్ష, వాహనం రిజిస్ట్రేషన్ను ఏడాది పాటు సస్పెండ్ చేయడం వంటి చర్యలు ఉండవచ్చని తెలిపారు. అలాగే నేరానికి పాల్పడిన మైనర్కు 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయరాదనే నిబంధన కూడా అమలులో ఉంటుందని వివరించారు.
ఇటీవల నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మైనర్లు నడిపిన వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు, సంబంధిత వాహన యజమానులు, తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎంవీఐ ఈ. రాహుల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ప్రమాద రహిత, సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
