
విజయభారతి : ఆర్మూర్ న్యూస్ : రిపోర్టర్: సుంకరి;గంగా మోహన్
ఆర్మూర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు మంజూరైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని కోరుతూ విద్యార్థి సంఘ నాయకులు రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.విద్యార్థి సంఘ నాయకుడు షాహిద్ అలీ నేతృత్వంలో, అంగారి ప్రదీప్ ఆధ్వర్యంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసిన ప్రతినిధి బృందం ఆర్మూర్ ప్రాంత విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించింది. దీనిపై స్పందించిన మంత్రి, ఆర్మూర్ ఏటీసీ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా షాహిద్ అలీ మాట్లాడుతూ, ఆర్మూర్తో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన 40 నుంచి 50 గ్రామాల విద్యార్థులు సాంకేతిక విద్య కోసం నిజామాబాద్, బషీరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఆర్మూర్లో ఏటీసీ సెంటర్ అందుబాటులోకి వస్తే స్థానికంగానే అత్యాధునిక సాంకేతిక విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందని, ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని తెలిపారు.దళిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు ఇతర వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా మారుతుందని, ఆర్మూర్ ప్రాంత యువత అభివృద్ధికి ఏటీసీ కీలకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జమాత్-ఎ-ఉల్మా ప్రతినిధి ఇబ్రాహీం, మర్కజ్ కమిటీ కార్యదర్శి రిజ్వాన్, జాఫర్ అలీ, షైబాజ్ తదితరులు పాల్గొన్నారు.
