సమావేశానికి వెళ్తేనే కదా.. ఏం మాట్లాడతారో తెలిసేది…!
గోదావరి జలాలపై బీఆర్ఎస్ది ప్రాంతీయ విద్వేష రాజకీయాలు
కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకే డ్రామాలు
టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు….
(విజయభారతి): హైదరాబాద్ న్యూస్: ఆగస్టు 13
హైదరాబాద్: గోదావరి జలాల విషయంలో బీఆర్ఎస్ నాయకులు కావాలనే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశానికి హాజరుకాకముందే సమావేశంలో ఏం చర్చిస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఊహించి రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
సమావేశానికి వెళ్తేనే కదా.. మీటింగ్లో ఏం మాట్లాడతారో తెలిసేది. సమావేశం జరగకముందేఅనవసరమైన ఆందోళనలు, ఆరోపణలు చేయడం ఎందుకు?” అని ఆయన ప్రశ్నించారు.
గోదావరి జలాల అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని రాంచందర్రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు ఈ అంశాన్ని పెద్దది చేస్తున్నారని ఆరోపించారు. ఎస్ ఐ ఆర్ పైనా సంచలన ఆరోపణలుఓటర్ల జాబితా సవరణ కోసం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపైనా రాంచందర్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి హిందూ ఓట్లను తొలగించే కుట్ర చేశాయని ఆయన ఆరోపించారు.
ఓటర్ల జాబితాలో ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు ఉండేలా చూడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందని, ఓట్ల తొలగింపుపై వచ్చిన అనుమానాలను ఎన్నికల సంఘం సమగ్రంగా పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు.
గోదావరి జలాలైనా.. ఓటర్ల జాబితా అయినా.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో అనవసర భయాలు, అనుమానాలు సృష్టించకుండా వాస్తవాలను ప్రజల ముందుంచాలని రాంచందర్రావు సూచించారు.
