



విజయభారతి :బాన్సువాడ, జూలై 8:
బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న ఎస్సీ ఇంటర్మీడియట్ వసతి గృహంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అమృత (18) అనే విద్యార్థిని వసతి గృహంలోని ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందింది. ఆమె కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందినట్లు స్థానికులు తెలిపారు.అమృత బుధవారం కళాశాలకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోయిందని, అనంతరం గదిలో ఉరేసుకుని ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.విషయం తెలుసుకున్న బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, డీఎస్పీ విట్టల్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి విద్యార్థిని మృతికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.అయితే, వసతి గృహ వార్డెన్ రాత్రి నుంచి అందుబాటులో లేరని, సిబ్బంది కూడా హాస్టల్లో లేకపోవడంపై విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ కుమార్తె ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించాలని, వసతి గృహ నిర్వహణలో నిర్లక్ష్యం ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఎస్సీ వసతి గృహం ఎదుట ధర్నా నిర్వహించారు. వార్డెన్తో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో హాస్టల్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
విద్యార్థిని మృతిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్డీవో, డీఎస్పీ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్, అక్బర్, కౌన్సిలర్ ఖలీల్, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
