
విజయభారతి ఆర్మూర్ న్యూస్, జూలై 14:
ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. గ్రామస్థాయిలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అవసరమైన పత్రాల సేకరణలో ప్రజలకు సహకరించాలని ఆయన సూచించారు.భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేయడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, మరణించిన వారు, నకిలీ పేర్లు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరించి ప్రత్యేక ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారని తెలిపారు. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని ఫారాలను నింపి బీఎల్ఓలకు అందజేయవచ్చని లేదా ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చని చెప్పారు.
కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఫారం-6లో తల్లిదండ్రుల పాత ఓటరు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, వివరాలు అందుబాటులో లేకపోతే సంబంధిత డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వివరాల్లో తేడాలు ఉంటే అధికారులు నోటీసులు జారీ చేసి పుట్టిన తేదీ, నివాస ధృవీకరణ వంటి ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ ప్రక్రియ ద్వారా అత్యంత ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని, ప్రజలంతా బీఎల్ఓలకు సహకరించి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు.
