


(విజయభారతి – నిజామాబాద్)
నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ తనిఖీల సందర్భంగా కొందరు ట్రాఫిక్ పోలీసుల వ్యవహారశైలిపై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో మధ్యాహ్నం సమయంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా, కొంతమంది వాహనదారులను ఆపి వాహనాల తాళాలు తీసేయడం, బైక్లను పక్కకు నెట్టించడం వంటి చర్యలు చేపట్టినట్లు అక్కడ ఉన్నవారు తెలిపారు.
అంతేకాకుండా, తమ వద్ద నగదు లేదని చెప్పిన వాహనదారులకు “గూగుల్ పే చేయండి” అంటూ జరిమానా చెల్లించాలని సూచించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలను కూడా ఆపి, కొందరిని జరిమానా విధించకుండా హెచ్చరించి పంపించడం కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ ఘటనను చిత్రీకరిస్తున్న సమయంలో అక్కడ ఉన్న ట్రాఫిక్ సీఐ “మీరు ఎవరు?” అని ప్రశ్నించగా, తాను మీడియా ప్రతినిధినని చెప్పిన వెంటనే అక్కడి సిబ్బంది వెళ్లిపోయినట్లు సమాచారం.
ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడం పోలీసుల బాధ్యతే అయినప్పటికీ, వాహనం నడుస్తున్న సమయంలో తాళాలు తీసేయడం లేదా బలవంతంగా పక్కకు నెట్టించడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై నిజానిజాలు వెలికి తీసి, ట్రాఫిక్ తనిఖీలు పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే జరిగేలా జిల్లా పోలీసు కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
